దళితులు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలివ్వాలి:సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డిమాండ్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
దళితులు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలివ్వాలి..
సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డిమాండ్..
బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట దళితుల ధర్నా, వినతిపత్రం సమర్పణ..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: బోధన్, జూన్ 15
బోధన్ డివిజన్ పరిధిలోని దళితులు సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టా దార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి. సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (ఆర్డీవో ఆఫీస్) ముందు సాలూర మండలం తగ్గేల్లి, ఖాజాపూర్ గ్రామాలకు చెందిన దళిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. గంగాధర్, సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ... ఖాజాపూర్ గ్రామంలోని మూడు పేద దళిత కుటుంబాలు గత 25 సంవత్సరాలుగా సీలింగ్ భూమిని సాగు చేసుకుంటున్నాయని, అలాగే తగ్గేల్లి గ్రామంలో 8 దళిత కుటుంబాలు గత 9 ఏళ్లుగా భూమిని నమ్ముకుని జీవిస్తున్నాయని తెలిపారు. ఇంతకాలంగా వారు భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పట్టాలు లేకపోవడం వల్ల ఈ దళిత రైతులు ప్రభుత్వం అందించే రైతు భరోసా, బ్యాంకు రుణ సదుపాయాలు, విత్తనాలు, ఎరువుల రాయితీలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పండించిన దిగుబడిని అమ్ముకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధిత దళిత కుటుంబాలకు వెంటనే పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. దేవయ్య, సిహెచ్. రమేష్, లాలయ్య, గంగారాం, బి. సాయిలు, లక్ష్మణ్, కే. గంగాధర్, అబ్బయ్య, సిహెచ్. రాములు మరియు తగ్గేల్లి, ఖాజాపూర్ గ్రామాలకు చెందిన దళిత రైతులు పాల్గొన్నారు.