బీడీ కార్మికులకు ఆంక్షలు లేని రూ. 4 వేల పింఛను వెంటనే ఇవ్వాలి: TUCI డిమాండ్...
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
బీడీ కార్మికులకు ఆంక్షలు లేని రూ. 4 వేల పింఛను వెంటనే ఇవ్వాలి: TUCI డిమాండ్
బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి.. బీడీ కార్మికుల భారీ ర్యాలీ, ధర్నా...
ఎన్నికల హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా అమలు చేయరా?
జూన్ 2 పెన్షన్ల ప్రకటనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: TUCI జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : బోధన్
రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 4,000 పింఛను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI)ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బోధన్ ఏరియా కమిటీ నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన బీడీ కార్మికులు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రంతో పాటు, పింఛన్ల కొరకు సిద్ధం చేసిన వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను ఏవో (AO) కు అందజేశారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ... ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులకు 'చేయూత' పథకం ద్వారా రూ. 4,000 పింఛన్ ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని మల్లేష్ గుర్తు చేశారు. కట్ ఆఫ్ డేట్ ఆంక్షలు తొలగించి, కొత్త వారందరికీ రూ. 4 వేలు ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం రూ. 2,016 పొందుతున్న పాత వారికి కూడా రూ. 4 వేలకు పెంచి ఇస్తామని నమ్మబలికారని మండిపడ్డారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోతున్నా నేటికీ ఆ హామీని నెరవేర్చకుండా బీడీ కార్మికులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పొంతన లేని ప్రకటనలతో ప్రజల్లో అయోమయం...జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని గత వారం రోజులుగా మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారని, కానీ నిన్న మొన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కొత్త పెన్షన్ల ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. వాట్సాప్ గ్రూపులలో, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటూ ప్రచారం జరుగుతుంటే.. సంబంధిత అధికారులను అడిగితే మాత్రం "మాకు పై నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు" అని చెబుతున్నారని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు మధ్య పొంతన లేని ఇటువంటి ప్రకటనల వల్ల పింఛన్ రాని పేద ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. జూన్ 2 నుండి అమలు చేయకుంటే బీడీ కార్మికుల ఆగ్రహం తప్పదు..ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం జూన్ 2 నుండి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని, పాత వారికి కూడా రూ. 4,000 కు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీడీ కార్మికుల తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు ప్రభుత్వం గురికాక తప్పదని బి. మల్లేష్ హెచ్చరించారు.ఈ భారీ ధర్నా కార్యక్రమంలో బోధన్ ఏరియా కమిటీ నాయకులు గంగామణి, లక్ష్మి, ఇంద్ర, పి.ఓ.డబ్ల్యూ (POW) పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకుడు పడాల శంకర్ మరియు బోధన్ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.