కామారెడ్డి జిల్లాలో ముగిసిన ఓటర్ల ఎస్ఐఆర్ ప్రక్రియ: 100 శాతం పూర్తయిన ఫారాల పంపిణీ
కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ: కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
భారత ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఓటర్ల వివరాల ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 796 పోలింగ్ కేంద్రాల ద్వారా 6,96,006 మంది ఓటర్లకు సంబంధించి ఎన్నికల ఫారాల ముద్రణ మరియు పంపిణీ వంద శాతం పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా ప్రగతి:
- జుక్కల్: 2,06,343 మంది ఓటర్లకు ఫారాల పంపిణీ 100 శాతం పూర్తి కాగా, 90.27 శాతం డిజిటైజేషన్ పూర్తయింది.
- యెల్లారెడ్డి: 2,28,503 మంది ఓటర్లకు ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందని, 90.17 శాతం డిజిటైజేషన్ జరిగినట్లు వెల్లడించారు.
- కామారెడ్డి: 2,61,160 మంది ఓటర్లకు ఫారాల పంపిణీ పూర్తికాగా, 83.96 శాతం డిజిటైజేషన్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,11,568 ఎన్నికల ఫారాలు (87.87 శాతం) డిజిటైజేషన్ చేయగా, 84,438 ధృవీకరణ కాని ఫారాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారుల (BLO) ద్వారా మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉన్నవారి వివరాలను సేకరించి స్పష్టమైన వర్గీకరణ చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్లకు కలెక్టర్ కీలక సూచనలు: ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని కలెక్టర్ కోరారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకున్నా లేదా ఏవైనా తప్పులు దొర్లినా, వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులను లేదా బీఎల్ఓలను సంప్రదించి సవరణలు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, పారదర్శకతతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో అంకితభావంతో పనిచేసిన ఎన్నికల సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు మరియు వివిధ శాఖల సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.