ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల ఉక్కుపాదం.. భారీగా జరిమానాలు వసూలు!
కామారెడ్డిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల కొరడా.. ₹1,51,790 జరిమానా వసూలు..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కొరడా ఝుళిపించారు. కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ నరహరి పర్యవేక్షణలో, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల రోడ్, అశోక్నగర్ ఎక్స్ రోడ్ మరియు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ముఖ్యంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు సరైన పత్రాలు లేని వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మొత్తం 143 స్పాట్ చలాన్లు నమోదు చేసి, ₹1,51,790 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉల్లంఘనల వివరాలు ఇలా..
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినవి - 146
- నిబంధనలకు విరుద్ధంగా/అసంబద్ధమైన నంబర్ ప్లేట్లు - 44
- నంబర్ ప్లేట్ లేని వాహనాలు - 17
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు - 05
- హెల్మెట్ లేని కేసులు - 03 పోలీసుల హెచ్చరికలు: వాహనదారులు తప్పునిసరిగా నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పోలీసులు కోరారు.