బోనం ఎత్తి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
అంగరంగ వైభవంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు.. బోనం ఎత్తి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
జిల్లా కేంద్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని 38, 30,40 వార్డులలో నిర్వహించిన మైసమ్మ సహిత పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తిపారవశ్యంతో సాగిన ఉత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వయంగా బోనం ఎత్తుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆషాఢ బోనాల పండుగ మన సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో జిల్లా కేంద్రంతో పాటు పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఎల్లవేళలా వర్ధిల్లాలని, పట్టణం సస్యశ్యామలంగా ఉండాలని ఆ శక్తిస్వరూపిణిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోటారి శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యురాలు గొనె సునీత శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, ముఖ్య నాయకులు సుకుమార్, సంజీవ్, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సింలు, కిరణ్ తో పాటు ఆయా వార్డుల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.