కామారెడ్డిలో రౌడీషీటర్పై పీడీ యాక్ట్ ప్రయోగం.. ఏడాది పాటు జైలు నిర్బంధం!
కామారెడ్డిలో రౌడీషీటర్పై పీడీ యాక్ట్ ప్రయోగం.. ఏడాది పాటు జైలు నిర్బంధం!
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లు, దోపిడీలు మరియు క్రిమినల్ బెదిరింపులకు పాల్పడుతున్న కరడుగట్టిన రౌడీషీటర్పై కామారెడ్డి జిల్లా పోలీసులు పీడీ (PD) యాక్ట్ను ప్రయోగించారు. వరుస నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఈ నిందితుడిపై జిల్లా కలెక్టర్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామానికి చెందిన రౌడీషీటర్ కాట్యాడ బాపురావు అలియాస్ బాపురావు గత కొంతకాలంగా అసాధారణ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ప్రజలను భయపెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, జర్నలిస్టు పేరుతో బెదిరింపులకు దిగడం, దోపిడీలకు పాల్పడడం వంటి చర్యల ద్వారా ప్రజాశాంతికి తీవ్ర భంగం కలిగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన దోపిడీ కేసుతో పాటు, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ఎక్స్టార్షన్, క్రిమినల్ బెదిరింపుల కేసులను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితుడి నేర చరిత్రను ఆధారంగా చేసుకుని, తెలంగాణ ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం–1986 (PD Act) కింద జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ ఈ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం న్యాయపరమైన నిర్బంధంలో ఉన్న నిందితుడికి సంబంధించిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను అధికారులు నిజామాబాద్ సెంట్రల్ జైలులో అందజేశారు. దీని ప్రకారం అతడు ఏడాది పాటు జైలులోనే నిర్బంధంలో ఉండనున్నాడు. కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ... ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించే దోపిడీదారులు, ఎక్స్టార్షన్లకు పాల్పడే గూండాలపై సాధారణ చట్టాలతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ను మరింత కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క సంఘవ్యతిరేక శక్తిపై కూడా కామారెడ్డి జిల్లా పోలీసులు రాజీపడేది లేదని, భవిష్యత్తులోనూ ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.