ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం: ఎంసిపిఐ(యు) పొలిట్బ్యూరో సభ్యులు వల్లేపు ఉపేందర్ రెడ్డి..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎంసిపిఐ(యు) పొలిట్బ్యూరో సభ్యులు వల్లేపు ఉపేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎంసిపిఐ(యు) జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్ల సమస్యలతో పాటు మౌలిక వసతుల కొరత వేధిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీసేలా ప్రజా ఉద్యమాలు రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.. దేశ సమైక్యతకు, సమగ్రతకు బీజేపీ పాలన పెను ముప్పుగా మారిందని ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజల సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతూ, లక్షల కోట్ల అప్పులతో పేదరికాన్ని పెంచుతున్నారని విమర్శించారు. మతోన్మాద, మనువాద విధానాలతో ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో భవిష్యత్తులో తగిన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సభ్యులు అంతంపల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్, జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, సుజాత, రఘుపతి, లింగం, భాగ్య, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.