కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు గుట్టు రట్టు: 60 సీసాలు స్వాధీనం, ఇద్దరి అరెస్ట్..
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు గుట్టు రట్టు: 60 సీసాలు స్వాధీనం, ఇద్దరి అరెస్ట్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కరడ్పల్లి గ్రామంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు దందాను పోలీసులు భగ్నం చేశారు. ప్రమాదకరమైన ఆల్ప్రాజోలామ్ (Alprazolam) మత్తు పదార్థాన్ని కల్లులో కలిపి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, భారీగా కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి... విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 05న తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరడ్పల్లి గ్రామంలోని ఓ కల్లు దుకాణంపై తాడ్వాయి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుకాణదారుడు సీతూరి @ గౌండ్ల పోచగౌడ్ (50) ను అదుపులోకి తీసుకుని, వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా... ఆ కల్లులో తీవ్రమైన సైకోట్రోపిక్ మత్తు పదార్థమైన ఆల్ప్రాజోలామ్ను కలిపి విక్రయిస్తున్నట్లు తేలింది. డ్రగ్ టెస్టుల్లో బయటపడ్డ నిజాలు పోలీసులు దాడులు చేసిన సమయంలో ఆ దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వినియోగదారులకు అక్కడికక్కడే ప్రాథమిక డ్రగ్ టెస్టు నిర్వహించగా బెంజోడయాజెపైన్ (Benzodiazepines) పాజిటివ్గా తేలింది. అనంతరం వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా, అక్కడ కూడా వారికి BZO పాజిటివ్గా నిర్ధారణ అయింది. లైసెన్స్ హోల్డర్ అరెస్ట్.. ఈ కేసులో దర్యాప్తును మరింత విస్తరించిన పోలీసులు, సదరు కల్లు దుకాణం లైసెన్స్ హోల్డర్ కొండాపురం స్వామిగౌడ్ (36) ను ఆగస్టు 06న అదుపులోకి తీసుకుని విచారించారు. కేవలం అక్రమ లాభాల ఆర్జన కోసమే కల్లులో ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయిస్తున్నట్లు విచారణలో స్పష్టమైంది. పోలీసుల స్వాధీనం మరియు చర్యలు..
- స్వాధీనం చేసుకున్నవి: 60 కల్లు సీసాలు, 2 మొబైల్ ఫోన్లు మరియు ఇతర సంబంధిత ఆధారాలు.
- నిందితులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలకు పోలీసుల హెచ్చరిక సమాజానికి హానికరమైన మత్తు పదార్థాలు, కల్తీ ఆహారాలు లేదా పానీయాలు విక్రయిస్తున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, కఠిన చర్యలు కొనసాగుతాయని కామారెడ్డి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.