దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి: బి. మల్లేష్..
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం: బి. మల్లేష్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :బోధన్, జూలై 4..
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి వేడుకలను శనివారం బోధన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ, నాడు నైజాం పాలనలో దేశ్ముఖ్లు, భూస్వాముల వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల్లో దొడ్డి కొమురయ్య పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. కడివెండి గ్రామంలో విసునూరు రామచంద్రారెడ్డి గుండాల కాల్పుల్లో కొమురయ్య అమరుడవడంతో, ఆ సంఘటన తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని గుర్తుచేశారు. ఈ పోరాటం ద్వారా సుమారు 10 లక్షల ఎకరాల భూస్వాముల భూములు పేదలకు దక్కాయని ఆయన వివరించారు. ప్రస్తుత పాలకులు ఆ సాయుధ పోరాట స్ఫూర్తిని విస్మరిస్తున్నారని మల్లేష్ విమర్శించారు. నేటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నాయని, ఇది దేశద్రోహంతో సమానమని ఆయన ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, బి. సాయిలు, గంగారాం, చాంద్, పోశెట్టి లింగం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.