జర్నలిస్టుల సమస్యలపై సమరశంఖం: 13న కలెక్టరేట్ల వద్ద నిరసన, 15న ధర్నా..
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి: టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు..
ఈనెల 13న కలెక్టరేట్ల ఎదుట నిరసన, 15న సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా.. ఆగస్టు నెలాఖరులో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలు..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :హైదరాబాద్,
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అందుకోసం ఉద్యమ బాట పట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణను ప్రకటించారు. ప్రకటించిన నిరసన కార్యక్రమాలు.. జూలై 13: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలపడం. జూలై 15:హైదరాబాద్లో రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించడం. ప్రధాన డిమాండ్లు: హెల్త్ కార్డులు: జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిమ్స్ మినహా ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవి పనిచేయడం లేదు. వెంటనే నూతన హెల్త్ కార్డులను జారీ చేయాలి. ఇండ్ల స్థలాలు:ఇండ్ల స్థలాల విషయంలో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరం. జర్నలిస్టులకు ఆశలు కల్పించి, ఆ తర్వాత అమలు చేయకుండా ప్రభుత్వం విస్మరిస్తోంది. అక్రిడిటేషన్ కార్డులు: అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ఆలస్యం కావడంతో బస్సు పాసులు అందక జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారందరికీ వెంటనే కార్డులు జారీ చేయాలి. సంక్షేమ పథకాలు: జర్నలిస్టులకు రూ. 10 వేల పెన్షన్ అందించాలి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలి. రాష్ట్ర మహాసభలు: జూలై నెలాఖరు వరకు అన్ని జిల్లాల మహాసభలను పూర్తి చేసి, ఆగస్టు నెలాఖరులో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం కన్వీనర్గా యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్ను రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, మానిక్ ప్రభు, గుడిగ రఘు, రాజశేఖర్, కార్యదర్శులు సలీమ, చంద్రశేఖర్, నవీన్, అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.